వ్యవసాయ సదస్సులతో అద్భుత ఫలితాలు
వైవిధ్య వ్యవసాయం వైపు రైతుల పయనం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ సదస్సులతో సాగుకు సరికొత్త దశ, దిశ దొరికిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వైవిధ్యమైన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 24 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్రామస్థాయిలో నిర్వహించిన వ్యవసాయ సదస్సులు విజయవంతమయ్యాయని చెప్పారు. సదస్సుల నిర్వహణకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల 2014లో కోటీ 34 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం, ప్రస్తుతం 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. 45 లక్షల టన్నులు ఉన్న ధాన్యం దిగుబడి.. 3 కోట్ల టన్నులకు చేరిందని వెల్లడించారు.
రూ.లక్షన్నర కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు, రూ.28,473 కోట్లతో వ్యవసాయ విద్యుత్తు మౌలిక సౌకర్యాలు కల్పించామని, ఏటా దాదాపు రూ.10,500 కోట్లు వెచ్చిస్తూ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని వివరించారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకూ రూ.50,447.33 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, మంగళవారం నుంచి తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రైతుబీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4150.90 కోట్లు పరిహారం అందజేశామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మార్కెట్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి సీజన్కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆయిల్పామ్ విస్తీర్ణం 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని, వరికి ప్రత్యామ్నాయంగా పత్తితోపాటు పప్పులు, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రైతు వేదికల్లో సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులకు మరింత చేరువ కావాలని సూచించారు.