న్యూఢిల్లీ : బీజేపీ నేతకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతను చుట్టుముట్టిన రైతులు ఆయన చొక్కా చింపి దాడికి పాల్పడ్డారు. రాజస్ధాన్లోని శ్రీగంగానగర్లోని గంగా సింగ్ చౌక్లో బీజేపీ నేతలు ధర్నా చేస్తుండగా అక్కడికి చేరుకున్న కొందరు రైతులు బీజేపీ ఎస్సీ మోర్చా చీఫ్ కైలాష్ మేఘ్వాల్పై చేయిచేసుకున్నారు.
రైతుల దాడి నుంచి అక్కడే ఉన్న రైతు సంఘాల నేతలు, పోలీసులు ఆయనను తప్పించారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారికి ఇలాంటి సత్కారమే జరుగుతుందని కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు ఆమ్రా రామ్ దాడి ఘటనను సమర్ధించారు. మరోవైపు దళిత నేతపై దాడి చేయడం సిగ్గుచేటని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని బీజేపీ రాజస్ధాన్ చీఫ్ సతీష్ పూనియా ఈ ఘటనను ఖండించారు.