హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): వర్షాల భయంతో బిక్కుబిక్కు మంటూ ధాన్యం కొనుగోళ్లపై అయోమయంలో ఉన్న రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీపికబురు చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గత వానకాలంలో, యాసంగిలో మాదిరిగానే ఈసారి కూడా గ్రామాల్లోనే కొనుకోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ కొంటామని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతులంతా సంతోషిస్తున్నారు. తమకు ఏ ఆపద రానీయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అండగా ఉంటారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల మేలు కోరే టీఆర్ఎస్ సర్కార్కే మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతుల నుంచి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొనుకోళ్లపై పౌరసరఫరాలశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రేడ్-ఏ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర నిర్ణయించి ఇప్పటికే పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సేకరణ కూడా మొదలైంది. ధాన్యం అమ్మకాల్లో రైతులకు ఇబ్బందులు ఎదురైతే 1800-42500333, 1967 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
కేసీఆర్తోనే రైతుకు మెతుకు
మాకు రెండెకరాల భూమి ఉన్నది. వరి పంట కోసి ధాన్యాన్ని అమ్మేందుకు ఎదురుచూస్తున్నాం. వర్షాలకు ధాన్యం తడవకుండా చూసేందుకు ప్రతి రోజూ ఎంతో శ్రమించాల్సి వస్తున్నది. అయినా ఇప్పటికే కొంత ధాన్యం తడిసింది. వర్షాలు ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏందన్న బెంగతో నిన్న రాత్రి నిద్రకూడ పోలే. తెల్లారేసరికి సీఎం కేసీఆర్ ప్రతి గింజ కొంటనని చెప్పారు. సరైన మద్దతు ధర ప్రకటించారు. ధాన్యాన్ని అమ్మేందుకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ గ్రామాల్లోనే కొంటారని చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించింది. సీఎం కేసీఆర్తోనే రైతుకు మెతుకు లభిస్తున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఆదుకొంటున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. – గొడుగు ఐలయ్య, రైతు