ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్కు నిరసనలు సెగ తప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని నిరసిస్తూ గత నెలలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఆయన ఇంటి ఎదుట వడ్లు పోసి ఆందోళనకు దిగారు. తాజాగా ఆదివారం ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు ఎంపీ ఇంటి ఎదుట పసుపును కుప్పలుగా పోసి నిరసన చేపట్టారు. అర్వింద్ రైతులకు చేసిన ద్రోహాన్ని ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెల్సిందే.
అర్వింద్ తీరుపై ఆగ్రహంగా ఉన్న రైతులు జిల్లాలో ఆయన్ను తిరగనివ్వబోమని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతుల గుండెల్లో బుల్లెట్లు దించుతామని అర్వింద్ అనడంపైన మండిపడుత్నురు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లోని రైతులంతా అర్వింద్ గుండెల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు బుల్లెట్లు దించుతామని చెప్తున్నారు. అర్వింద్ ఎంత సెక్యూరిటీ పెట్టుకొని తిరిగినా తరిమి తరిమికొడుతామన్నారు.