లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలో సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) మహాపంచాయత్ నిర్వహించనున్నది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన కొనసాగిస్తామని ఇప్పటికే రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP)పై చట్టం చేసి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కిసాన్ మహాపంచాయత్ కోసం లక్నో వెళ్తున్నట్లు తెలిపారు. యూకేయూ యూపీ వైస్ ప్రెసిడెంట్ హర్నామ్ సింగ్ వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఎంఎస్పీ చట్టం ఎప్పుడు చేస్తారో చెప్పలేదన్నారు. చట్టం చేసే వరకు, కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.
మహాపంచాయత్లో అనేక ఇతర అంశాలపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 14 రోజుల్లో చెరకు రైతులకు చెల్లింపులు చేస్తామని (యూపీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో) బీజేపీ చెప్పిందని, కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలుకాలేదని, నాలుగున్నరేళ్లలో చెరకు ధర కేవలం రూ.25 మాత్రమే పెరిగిందంటూ ఆరోపించారు.