ఓదెల, సెప్టెంబర్ 29 : పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన కలవేన నాగరాజు తనకున్న మూడున్నర భూమిలో మూడెకరాల్లో పత్తి, వరి వేశాడు.
మిగిలిన అర ఎకరంలో రెండు నెలల కిందట 30 వేల పెట్టుబడి పెట్టి పొకబంతి, సీతమ్మజడ పూలు సాగు చేశాడు. అక్కడే మంచె వేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ప్రస్తుతం పంట చేతికి వస్తుందని, దసరా, దీపావళి పండుగల సీజన్లో మస్తు గిరాకీ ఉంటుందని ఆయన చెబుతున్నాడు. అన్ని ఖర్చులు పోనూ 60 వేల దాకా మిగులుతాయని పేర్కొంటున్నాడు.