వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా ఆగస్టు 13తో స్కీమ్ రెన్యువల్ అవుతుండడంతో ఈసారి కూడా రైతుల తరఫున ప్రీమియం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది భూమి కొన్న రైతులకు సైతం అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. జూన్ 22 నాటికి పట్టాదారు
పాస్పుస్తకాలు అందుకున్న వారు ఆగస్టు ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లాలో ఇప్పటికే 2.84లక్షల మంది పేర్లు బీమా పోర్టల్లో నమోదు కాగా, 18 సంవత్సరాల నుంచి 59 ఏండ్ల వయస్సున్న మరో 50వేల మంది వరకు ఈసారి అవకాశం దక్కనున్నట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం చెప్తున్నది. అర్హులు ఏఈఓల దగ్గరకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
నల్లగొండ, జూలై 19 : రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న రైతు ఏ కారణంతో మరణించినా ఆ రైతుకు ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల క్లెయిమ్ వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 5.08 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది నాటికి ఈ పథకం కింద 2.81 లక్షల మంది రైతులకు వ్యవసాయ శాఖ బాండ్లు ఇచ్చింది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న వారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించింది.
ఆగస్టు ఒకటి వరకు అవకాశం..
అర్హులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ పేరు, నామినీ ఆధార్ కార్డుతో దరఖాస్తు ఫారం సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి అందజేస్తే వారు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. అయితే ప్రభుత్వం ప్రతి రైతు పేరిట ఎల్ఐసీకి రూ.3,378 చెల్లించి రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నది. సాధారణ మరణం సంభవించినప్పటికీ ఈ క్లెయిమ్ వర్తిస్తుంది. 2018 ఆగస్టు 13న ప్రారంభించిన ఈ పథకంలో జిల్లా నుంచి 2,24, 704 మంది నమోదు కాగా, ఈ ఏడాది 2,81,536 మందిని నమోదు చేశారు. ఈ ఏడాది మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
ఇప్పటి వరకు 5,377 మందికి రూ.268 కోట్ల క్లెయిమ్
ప్రతి ఏడాది ఆగస్టు 13 నుంచి ఏడాదిపాటు ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఆధారంగా రైతులు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబంలోని నామినీ ఖాతాలో వారంలోపే క్లెయిమ్ జమ అవుతుంది. ఈ స్కీం పరిధిలో ఉన్న రైతులు గడిచిన నాలుగేండ్లలో 5,377 మంది మృతి చెందగా, వారికి రూ.5 లక్షల చొప్పున రూ.268.85 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఈ ఆగస్టు 13 నాటికి ఎల్ఐసీతో స్కీం గడువు పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు ఉచితంగా మరోసారి స్కీమ్ను వర్తింపజేస్తూ ప్రీమియం చెల్లించనున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ ఈ ఆగస్టు వరకు గడువు ఇచ్చింది. జిల్లాలో 74,373 మంది ఇప్పటి వరకు ఈ బీమాకు దరఖాస్తు చేసుకోకపోగా, ఈ ఏడాది జూన్ 22 నాటికి మరో 28,519 మందికి కొత్తగా పాస్ పుస్తకాలు అందజేశారు. వీరిలో 18 నుంచి 59 ఏండ్ల వయసున్న వారు సుమారు 50 వేల మంది దాకా ఉండే అవకాశం ఉన్నందున వారంతా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది.
ఉచిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి
ఈ ఏడాది ఆగస్టు 13 నాటికి ఉచిత బీమా స్కీం పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి బీమా సౌకర్యం అమలుచేసే అవకాశం ఇచ్చిందని, అర్హులైన రైతులు ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఏడీఏ హుస్సేన్ బాబుతో కలిసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2.81లక్షల మంది రైతులకు ప్రస్తుతం ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తున్నందున, మిగిలిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో గతంలో పాస్ పుస్తకాలు పొందినవారు 74 వేల మంది ఉండగా, ఇటీవల పొందినవారు మరో 28వేల మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో 18 నుంచి 59 ఏండ్ల వయసున్న వారు ఆగస్టు 1 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -జిల్లా వ్యవసాయాధికారి సుచరిత