కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తికి చెందిన ఎడవెల్లి భూపతిరెడ్డి, తైవాన్ జామతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో మామిడి, అరటి తోటలు సాగు చేశాడు. మార్కెటింగ్ కోసం దళారులను ఆశ్రయించి, తీవ్రంగా నష్టపోయాడు. దీంతో మూడెకరాల్లో తైవాన్ జామ మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు రూ. 40 చొప్పున చెల్లించి, గుంటూరు జిల్లా పెద్దలంక నుంచి తెప్పించాడు. అధిక సాంద్రత పద్ధతిలో ఎకరానికి 1,500 చొప్పున, మూడెకరాల్లో 4,500 మొక్కలు నాటాడు. ఇందుకోసం రూ.2 లక్షల దాకా ఖర్చు పెట్టాడు.
మెలకువలు పాటించాల్సిందే!
జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నది భూపతిరెడ్డి మాట. తైవాన్ రకం జామ మొక్కలకు తల్లి వేరు ఉండదు. పిల్ల వేరుపైనే మొక్కలు నిలబడతాయి. వేర్లు భూమి పైభాగంలో ఉండటంతో మందుల పిచికారీ, యంత్రాలతో కలుపు తీయడం వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటిన మొదటి దశలో పవర్ వీడర్తోనే కలుపు తీయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతినెలా కూలీలతో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎకరానికి క్వింటాలు చొప్పున వేప పిండి వేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా వేస్ట్ డీకంపోజర్ను అందించాలి. జామ తోటలో వేరుకుళ్లు తెగులు, నిమటోడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని ఉధృతిని తగ్గించేందుకు ఎర పంటగా బంతిని సాగు చేసుకోవడం మంచిది. అలాగే, 200 లీటర్ల నీటిలో 10 కిలోల వేప పిండి, 10 కిలోల పుట్టమన్ను, 2 కిలోల బెల్లం కలిపి 48 గంటల పాటు పులియబెట్టాలి. ఇందులో ఔషధ ఆకుల ద్రావణం కలిపి, మరో 48 గంటలపాటు పులియబెట్టి ఒక్కో మొక్కకు అందించాలి. దీనివల్ల నిమటోడ్ వ్యాధిని నివారించవచ్చు. రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు ఎకరానికి రెండు సోలార్ లైట్ ట్రాప్స్ను ఏర్పాటు చేసుకోవాలి. తెగుళ్ల నివారణకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎకరానికి 2 కిలోల సూడో మొనాస్ లేదా బాసిల్లస్ లేదా ట్రైకోడెర్మా అనే జీవ ఎరువును 200 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా అందించాలి.
ఆరు నెలల నుంచే..
భూపతిరెడ్డి సాగు చేసిన తైవాన్ జామ ఆరు నెలల నుంచే కాతకు వచ్చింది. అయితే, మొక్కలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి కాతను ఆదిలోనే తొలగించాడు. రెండో కాత నుంచి ప్రతిరోజూ ఎకరానికి 150 కిలోల చొప్పున దిగుబడి సాధించాడు. ఇలా నెలలో 15 నుంచి 20 రోజులు కాయలు తెంపుతూ, ఎకరానికి మూడు టన్నుల పంటను పొందాడు. తోట సాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలపాటు ఇదే స్థాయిలో దిగుబడి వచ్చింది. అంటే సగటున ఒక సీజన్లో 30 టన్నుల దిగుబడిని అందుకొన్నాడు. ఆ సమయంలో తైవాన్ జామకు మార్కెట్లో కిలో రూ.20 చొప్పున ధర పలికింది. అంటే, 30 టన్నులకు రూ. 6 లక్షల వరకూ ఆదాయం ఆర్జించాడు. అన్ని ఖర్చులూ పోనూ, నాలుగు నెలల్లో రూ.4.50 లక్షల లాభం వచ్చినట్లు భూపతిరెడ్డి చెబుతున్నాడు.
మంచి లాభాలు..
తైవాన్ జామతో మంచి లాభాలు పొందవచ్చు. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే విపరీతమైన కాత వస్తుంది. గతంలో మామిడి, అరటి తోటలు వేశాను. మార్కెటింగ్ ఇబ్బందులు ఎదురుకావడంతో కొంతభాగం తొలగించి, ఆ స్థానంలో తైవాన్ జామ సాగు చేశాను. మొదట కొంత పురుగుల ఉధృతి కనిపించింది. నిరాశ చెందకుండా వాటిని అరికట్టగలిగాను. నాలుగు నెలల్లో ఎకరానికి సగటున 10 క్వింటాళ్ల చొప్పున మూడెకరాల్లో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే, స్థానిక మార్కెట్లలోనే అమ్మాను. రూ. 6 లక్షల దాకా ఆదాయం వచ్చింది. అన్ని ఖర్చులూ పోను రూ. 4.50 లక్షలు మిగిలాయి. దీనినుంచి ఏడాది పొడవునా కాత వస్తుంది. నెలలో 15 నుంచి 20 రోజులు మాత్రమే కాయలు
తెంపుతున్నాం. – ఎడవెల్లి భూపతి రెడ్డి, రైతు.
-దొంత వెంకటస్వామి