రెండు పథకాల ద్వారా 54,178 కోట్లు అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్లు అందించినట్టు వెల్లడించింది. ఇందులో రైతుబంధు ద్వారా ఎనిమిది సీజన్లలో కలిపి రూ.50,465 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వివరించింది. రైతుబీమా ద్వారా 74,268 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.3,713 కోట్లు పరిహారం ఇచ్చినట్టు తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాల రైతులే అధిక లబ్ధి పొందినట్టు స్పష్టం చేసింది. రైతుబంధు పథకంలో బీసీలు 53 శాతం లబ్ధి పొందగా, ఎస్సీలు 8.10 శాతం, ఎస్టీలు 7.86 శాతం, ఇతరులు 12.70 శాతం లబ్ధి పొందినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 75 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని వివరించింది. రైతుబంధు ద్వారా ఏటా రూ.10 వేలు అందించటం వల్ల పెట్టుబడి కష్టాలు తప్పాయని పేర్కొన్నది.
స్థిరంగా పెరిగిన వ్యవసాయం
మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయం, సహకారం, అనుబంధ రంగాలు స్థిరంగా మెరుగుపడ్డాయని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ వెల్లడించింది. 2014-15లో 16.3 శాతం ఉన్న వ్యవసాయ స్థూల విలువ.. 2020-21 లో 20.5 శాతానికి పెరిగిందని తెలిపింది.
అన్ని రంగాల్లో మెరుగు
వరి దిగుబడిలో దేశ సగటు హెక్టారుకు 2,722 కిలోలు ఉండగా, తెలంగాణ సగటు 3,693.6 కిలోలతో దేశంలో 3వ స్థానంలో నిలిచింది. కందుల సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో నిలిచింది. వేరుశనగ దిగుబడిలో 3వ స్థానం, వేరుశనగ, పత్తి సాగు విస్తీర్ణంలో 3వ స్థానం, సోయాబీన్ దిగుబడిలో 2వ స్థానంలో ఉన్నది. అటు.. 2014-15తో పోలిస్తే 2020-21 నాటికి మత్స్యరంగం 30 శాతం, పాల దిగుబడిలో 6 శాతం, మాంసం ఉత్పత్తిలో 22 శాతం, చికెన్ ఉత్పత్తిలో 22 శాతం, గుడ్ల ఉత్పత్తిలో 16 శాతం పెరుగుదల నమోదైంది.