అమరావతి : మాజీ కేంద్రమంత్రి, రెబల్స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో మొగల్తూరుకు తరలివచ్చారు. నటుడు ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు సభ కార్య క్రమం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. దీంలో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టారు.
ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను పలకరించి అందరూ భోజనాలు చేసి వెళ్లాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభలో పాల్గొని మాట్లాడారు. రెబల్స్టార్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని తెలిపారు. అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.