న్యూఢిల్లీ : రెండు నెలలుగా ఐసీయూలో కరోనాతో పోరాడుతూ ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు, ఆర్థోపెడిక్ సర్జన్ రమేశ్కుమార్ కన్నుమూశారు. దేశంలోని ప్రసిద్ధ ఆర్థోపెడిక్ నిపుణుల్లో ఒకరు. ఆయన సెంట్రల్ ఆర్థోపెడిక్ ఇన్స్టిట్యూట్ (సీఐఓ) అధిపతి. 39 సంవత్సరాల వైద్యవృత్తిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వేలాది మందికి స్పైనల్కార్డ్ నిపుణుడైన రమేశ్కుమార్ చికిత్స అందించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. 2016 సంవత్సరంలో 108 ఏళ్ల మహిళ వృద్ధాప్యం, తుంటి సమస్యలతో బాధపడుతూ మంచం పట్టింది. డాక్టర్ రమేశ్ సవాల్గా తీసుకొని హిప్ ట్రాన్స్ప్లాంట్ చేయడంతో ఆమె మూడు రోజుల్లోనే మంచంపై నుంచి లేచి నిలబడింది.
డాక్టర్ రమేశ్ కుమార్ రెండు నెలల కిందట కరోనా బారినపడ్డారు. ప్రారంభంలో ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించగా.. వెంటనే సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. సీనియర్ వైద్యుల బృందం ఐసీయూలో ఉంచి.. ఆయనకు చికిత్స అందించింది. కొద్ది రోజులకు ఆరోగ్యం మెరుగైంది. మళ్లీ రెండు వారాల కిందట పరిస్థితి విషమించినట్లు దవాఖాన సీనియర్ వైద్యుడు తెలిపారు.
అనేక ప్రయత్నాలు చేసినా ఆయనను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది షాక్ గురయ్యారు. ఆయన మృతికి డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) సంతాపం ప్రకటించింది. ఆసుపత్రితో పాటు దేశం కష్టపడి పని చేసే అనుభవజ్ఞుడైన వైద్యుడిని కోల్పోయిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. సీఐఓను, సప్ధర్జంగ్ హాస్పిటల్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారని వైద్యులు పేర్కొన్నారు.