హైదరాబాద్: ఫలక్నుమాతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆటోమ్యాటిక్ కోచ్ వాష్ ప్లాంట్ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రైళ్ల రాకపోకల విషయమై ఎస్సీఆర్ తాత్కాలిక మార్పులు చేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్- ధనపూర్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కాక కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలను కొనసాగిస్తాయని ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనున్నది.
సికింద్రాబాద్ – ధనపూర్ (02787), సికింద్రాబాద్ -మన్మాడ్ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్ప్రెస్ – 07064) రైలు కూడా నిర్ణీత కాలంలో సికింద్రాబాద్కు బదులు కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నది. ఈ మూడు రైళ్లు తిరుగు పయనంలోనూ కాచిగూడకే చేరుకుంటాయని తెలిపారు.