దుబాయ్: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సీనియర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారన్న వార్త పెను దుమారమే రేపుతోంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ కోశాధికారి స్పందించిన విషయం తెలుసు కదా. ఇలాంటి చెత్త వార్తలు రాయొద్దని ఆయన మీడియాకు కూడా హితవు పలికారు. తాజాగా ఆ సీనియర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ ( Kohli vs Ashwin ) కూడా ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే అతడు తనదైన స్టైల్లో కాస్త ఫన్నీగా, మరికాస్త ఘాటుగా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్పందిస్తూ.. నేను ఫేక్ న్యూస్ అనే హ్యాండిల్ కోసం వెతుకుతున్నా. అది పుకార్లతో మంచి వినోదం అందిస్తుంది అని పోస్ట్ చేశాడు. తర్వాత రెండు నిమిషాల్లోనే మరో స్టోరీ పోస్ట్ చేస్తూ.. వెతుకుతున్నది దొరికింది.. ఇప్పుడా ఫేక్ న్యూస్ అనేది పేరు మార్చుకుందట. ఇప్పుడు దానిని ఐఏఎన్ఎస్ అని పిలుస్తున్నారట. మరికొంత మంది కూడా వాళ్ల నుంచి వీటిని తీసుకుంటారట. చాలా ఫన్నీగా ఉంది అని అశ్విన్ అన్నాడు.
టీమ్లోని సీనియర్లు ముఖ్యంగా అశ్విన్.. కోహ్లి కెప్టెన్సీపై అసంతృప్తిగా ఉన్నాడని ఈ ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీయే మొదట బయటపెట్టింది. దీంతో ఆ ఏజెన్సీని టార్గెట్ చేస్తూ అశ్విన్ ఇలా ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. కోహ్లి కెప్టెన్సీపై మొదట నోరు విప్పింది అశ్వినే అని, అతడు నేరుగా బీసీసీఐ పెద్దలనే కలిసి ఫిర్యాదు చేశాడని ఐఏఎన్ఎస్ వార్త రాసింది. రహానే, పుజారా కూడా ఇంగ్లండ్ నుంచి బీసీసీఐ సెక్రటరీ జే షాకు ఫిర్యాదు చేశారనీ తెలిపింది. అయితే ఈ వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఖండించారు.