అకాడమీ నిధుల కాజేతకు ఏడాదిగా స్కెచ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసిన ముఠా.. ఇందుకోసం 43 నకిలీ బాండ్లను కొండాపూర్లో తయారుచేసినట్టు విచారణలో తేలింది. అసలైన ఎఫ్డీ బాండ్లను తమ వద్ద ఉంచుకొన్నట్టు వెల్లడయింది. నకిలీ బాండ్ల తయారీలో తమిళనాడు కోయంబత్తూర్కు చెందిన పద్మనాభన్, హైదరాబాద్కు చెందిన మదన్ కీలక వ్యక్తులని పోలీసులు తేల్చారు. ఇందులో పద్మనాభన్ను ఇప్పటికే అరెస్ట్చేశారు. నకిలీ బాండ్లను తయారుచేయించింది మాత్రం ప్రధాన సూత్రధారి సాయికుమార్. నకిలీ బాండ్ల తయారీ కోసం పద్మనాభన్, మదన్ కొండాపూర్ సైబర్రిచ్ అపార్టుమెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. పద్మనాభన్ తమిళనాడు వెళ్లినప్పుడు అక్కడినుంచి కూడా నకిలీ బాండ్లు తయారుచేసి కొరియర్లో పంపించేవాడు. అకాడమీ ఎఫ్డీలు కాజేసేందుకు సాయికుమార్ ముఠా సంవత్సరం పాటు స్కెచ్ వేసింది. అకాడమీకి, బ్యాంకులకు ఏజెంట్లుగా వ్యవహరించిన వారి గురించి ఆరా తీసింది. భూపతిరావు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతాడనే విషయం తెలుసుకుని అతన్ని బుట్టలో వేసుకున్నది. సాయికుమార్ ముఠా.. అకాడమీకి వెళ్లిన సమయంలో తాము బ్యాంకు అధికారులమని, బ్యాంకులకు వెళ్లిన సమయంలో తాము అకాడమీ అధికారులమని నమ్మించింది. అందరినీ ముఠాలో చేర్చుకుని ఫిక్స్డ్ డిపాజిట్లు సులువుగా కొట్టేసిందని విచారణలో వెల్లడయింది. అకాడమీ నిధుల స్కాం కేసులో కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన కస్టడీ కొనసాగుతున్నది. తన వాటాగా వచ్చిన రూ.2 కోట్లతో ఆస్తులు కొన్నట్టు వెల్లడించడంతో ఆయా ఆస్తుల పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.