ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉవ్వెతున్న ప్రవహిస్తుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా చేరుకుంటుంది. శనివారం నుండి స్థిరంగా కొనసాగుతున్న వరద ఆదివారం సైతం దాదాపు లక్ష క్యూసె క్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఉగ్రరూపంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మను 16 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 66,010 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఆయకట్టుకు, త్రాగునీటి పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎడమ కాలువకు 820 క్యూసెక్కులు, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు150, భీమా ఎత్తిపోతలు-2కు750, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుతుత్పత్తికి 41,009 క్యూసెక్కుల నీటి ని వదులుతుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో 12 యూనిట్లలో విద్యుతుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతుంది.
ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.844 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 271.215 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.29 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 295.570 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 9.111 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మొత్తంగా ప్రాజక్టు నుంచి 1,09,634 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది.