న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశం నుంచి ఎగుమతులు తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆల్టైమ్ రికార్డుస్థాయికి పెరిగాయి. 2021-22లో ఇవి 43.19 శాతం వృద్ధితో 417.81 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం 2020-21లో 291.81 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. ముగిసిన ఏడాది దిగుమతులు సైతం 54.71 శాతం పెరుగుదలతో 394.44 బిలియన్ డాలర్ల నుంచి 610.22 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 192.41 బిలియన్ డాలర్లకు విస్త్రతమయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు తొలిసారిగా 40 బిలియన్ డాలర్ల మార్క్ను దాటినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 మార్చి నెలలో జరిగిన 35.26 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే 2022 మార్చిలో 18 శాతం వృద్ధిచెంది 40.38 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదే నెలలో దిగుమతులు 48.90 బిలియన్ డాలర్ల నుంచి 20.79 శాతం వృద్ధిచెంది 59.07 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 18.69 బిలియన్ డాలర్లుగా ఉంది.
పెట్రోలియంయేతర ఎగుమతులు పూర్తి ఆర్థిక సంవత్సరంలో 32.62 శాతం వృద్ధితో 266 బిలియన్ డాలర్ల నుంచి 352.76 డాలర్లకు పెరిగాయి. మార్చి నెలలో ఇవి 31.65 బిలియన్ డాలర్ల నుంచి 4.28 శాతం పెరిగి 33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియంయేతర దిగుమతులు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 44.2 శాతం పెరిగాయి. 311.75 బిలియన్ డాలర్ల నుంచి 449.54 డాలర్లకు చేరాయి. మార్చి నెలలో ఇవి 38.63 బిలియన్ డాలర్ల నుంచి 40.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి.