కాబూల్: తాలిబన్లు అంటేనే క్రూరత్వం గుర్తుకువస్తుంది. అయితే అలాంటి రోజులు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో కనిపించనున్నాయి. ఇటీవల ఆ దేశాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా ఓ ప్రకటన చేశారు. మతపరమైన శిక్షలు ఉంటాయని ఆ వర్గానికి చెందిన ఓ నేత తెలిపారు. అతి కిరాతకంగా చంపివేయడం, కాళ్లు, చేతుల్ని నరికివేయడం లాంటి శిక్షలను మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రిజన్స్ ఇంచార్జీ నేత ముల్లా నూరుద్దిన్ తురాబి తెలిపారు. అయితే అలాంటి శిక్షలను ఈసారి పబ్లిక్గా అమలు చేయబోమన్నారు. 1990 దశకంలో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఏలిన రోజుల్లో ఇలాంటి శిక్షలనే అమలు చేసేవారు.
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తిరిగి చేజిక్కించుకున్న తాలిబన్లు మెల్లమెల్లగా తమ స్టయిల్ పాలనను అమలులోకి తీసుకువస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. హీరత్ నగరంలో హై ప్రొఫైల్ మహిళలను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. ఇంటి బయట తిరగకుండా.. డ్రెస్సు కోడ్పై ఆంక్షలు విధిస్తున్నారు. హజారాలోని మైనార్టీపై అఘాయిత్యానికి పాల్పడిన 9 మందిని చంపిన ఘటనలో తాలిబన్లపై ఆమ్నెస్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా శిక్షలు వేసే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఓ తాలిబన్ నేత ప్రకటించారు.