కోల్కతా : ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు చూస్తుంటాం. కొన్ని విచిత్రంగా ఉంటుండగా.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. మొన్న రాహుల్గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్కీలు తీసి అలరించగా.. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఓ నేత ‘తప్పయింది.. క్షమించండి..’ అంటూ చెవులు పట్టుకుని బస్కీలు తీశాడు. ఈ చేష్టలకు స్టేజీపైన ఉన్న సీనియర్ నాయకులు అంతా ఘొల్లుమనగా.. కింద ఉన్న కార్యకర్తలు మాత్రం ఈలలు వేస్తూ మరింతగా ప్రోత్సహించే పని చేశారు. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీలోకి చేరికలు నానాటికి పెరిగిపోతున్నాయి. గురువారం నాడు మేధినీపూర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో టీఎంసీ మాజీ నాయకుడు సువేందు అధికారికి నమ్మదగిన వ్యక్తి అయిన సుశాంతా పాల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలో ఉండి ఇన్నిరోజులు చాలా తప్పు చేశానని, అందుకు తనను ప్రజలు క్షమించాలని కోరారు. 2018 లో పంచాయతీ ఎన్నికలు తన కనుసన్నల్లో జరిగేట్లుగా చేసి పెద్ద సంఖ్యలో పంచాయతీలను తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నో అంశాలపై మాట్లాడుతున్న తన గొంతును టీఎంసీ నేతలు నొక్కేశారన్నారు. అందుకే ప్రజల గొంతును వినిపించేందుకు బీజేపీలో చేరానని తెలిపారు. టీఎంసీలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్యంగా అంటూ.. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి చెవులు పట్టుకుని బస్కీలు తీయడం మొదలుపెట్టారు. దాంతో బీజేపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ ఈలలు వేస్తూ ఆయనను ప్రోత్సహించారు. మేధినీపూర్లో బహిరంగ సభ సందర్భంగా సువేందు అధికారి నేతృత్వంలో టీఎంసీకి చెందిన పలువురు నేతలు, నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇలాఉండగా, సుశాంతాపాల్ను నాలుగేండ్ల క్రితమే పార్టీ నుంచి తొలగించామని, ఇప్పుడు ఆయనకు టీఎంసీలో ఎలాంటి బాధ్యతలు లేవని మేధినీపూర్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అజిత్ మైతి చెప్పారు. బీజేపీ నేతల ప్రాపకం సంపాదించేందుకే ఆయన నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.