వైద్య ఖర్చుల పరిమితి రూ.10 లక్షలు
బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, గరిష్ఠ పింఛను రూ.70 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వైద్య ఖర్చుల పరిమితిని కూడా రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నది.
ఈ రెండు నిర్ణయాలకు సంబంధించిన బిల్లులను ఆమోదం నిమిత్తం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సభ్యులంతా సీఎం కేసీఆర్ను కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు వారి కనీస పెన్షన్ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని, అప్పర్ సీలింగ్ రూ.70 వేలకు పరిమితం చేయాలని బిల్లులో పేర్కొన్నట్టు తెలిపారు. దీన్ని సభ్యులంతా ఆమోదించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైద్య సేవల కోసం నానా కష్టాలు పడటాన్ని చూసి చలించిన సీఎం కేసీఆర్ వారికి రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయాన్ని కల్పించారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ మొత్తం నాలుగు లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2016 ఏప్రిల్ 23న పెన్షన్ను పెంచారు. అది కనిష్ఠంగా రూ.30 వేలు ఉండగా, ఎన్ని టర్మ్లు ఎన్నికైతే అందులో సంవత్సరానికి వేయి రూపాయల చొప్పున పెంచుతారు. గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.70 వేల వరకు చెల్లించనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందితే వారి జీవిత భాగస్వామికి కూడా అంతే మొత్తం పెన్షన్ అందిస్తున్నారు. అదేవిధంగా వైద్య ఖర్చుల కోసం ఇస్తున్న లక్ష రూపాయలు సరిపోవడం లేదని, అదనపు ఖర్చుల కోసం మాజీ ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే బాగన్న ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చనిపోతే ఆయన వైద్య ఖర్చులకైన బిల్లు రూ.2.50 లక్షలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి జీవితభాగస్వాముల వైద్య ఖర్చులు రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కృతజ్ఞతలు తెలిపిన మాజీలు
పెన్షన్లు, వైద్యఖర్చుల మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించినందుకు మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్రావు, ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్, ఆంజనేయులు, నాగపురి రాజలింగం, చంద్రావతి, జీ రామకృష్ణారెడ్డి, పుట్ట మధు తదితరులున్నారు.