సిటీబ్యూరో, సెస్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు, మాజీ మావోయిస్టు ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్న పట్టుబడ్డాడు. మంగళవారం హైదరాబాద్ షేక్పేట చౌరస్తాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన ఆయన్ను అరెస్టు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ జోయల్డేవిస్ తెలిపారు. నాగర్కర్నూలు జిల్లాలో ఇంటర్ వరకు చదివిన ఆయన రెండు వివాహాలు చేసుకున్నాడు. ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
శ్రీశైలం అలియాస్ మల్లన్న, శాఖమూరి అప్పారావు, రామకృష్ణ, చెన్నకేశవ, ఆర్కే, పటేల్ సుధాకర్రెడ్డి, సీతారాంరెడ్డి అలియాస్ నాగన్న, మాధవన్న, మల్లన్న, సుదర్శన్రెడ్డితోపాటు మరో 15 మంది వద్ద పనిచేశాడు. 1993లో ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీంతోపాటు శేషన్న అరెస్టు కాగా, అప్పట్లో టాడా కేసు నమోదైంది. జైల్లో ఉన్నపుడు నయీంతో స్నేహం పెరిగి నేరాలకు ప్రణాళికలు రూపొందించారు. 2014లో కోనపురి రాములు హత్య కేసులోనూ నిందితుడు. తాజాగా హుమాయిన్నగర్ పోలీస్స్టేషన్లో ఆయుధాల చట్టం కింద శేషన్నపై కేసు నమోదయ్యింది. 2016లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న ఆరేండ్లుగా ఎక్కడున్నాడు ? ఏం చేశాడు ? అన్న దానిపై నిఘా సంస్థలు ఆరాతీస్తున్నాయి.