బెంగళూర్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ పోస్టర్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారని, వారు ఇలాగే చేస్తే కాషాయ నేతలెవరూ కర్నాటకలో స్వేచ్ఛగా తిరగలేరని సిద్ధరామయ్య వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే బీజేపీ నేతలు బయటకు రాలేరని అన్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఇక భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్నాటకలోకి ప్రవేశించగా రాష్ట్ర సరిహద్దుల వద్ద రాహుల్ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు నేతలు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు.