న్యూఢిల్లీ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన అనంతరం ఆయనను జైలు నుంచి రిలీజ్ చేసినట్లు ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాల పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు నెలలు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా మినహాయింపును ఇచ్చింది. సర్కారు నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది.
ఇప్పటికే తొమ్మిదిన్నరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకోవడంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా 2013లో అరెస్టయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో 2020, మార్చి 26న పెరోల్పై విడుదలయ్యారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న మళ్లీ జైలులో లొంగిపోయారు. 2000లో 3,206 జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారన్న కేసులో చౌతాలా, ఆయన కుమారుడు కుమారుడు అజయ్ చౌతాలా, ఐఎఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మంది దోషులుగాకోర్టు నిర్ధాంచింది. వీరందరికీ 2013, జనవరిలో ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో జైలు శిక్షలు ఖరారు చేసింది.