టీమిండియా యువ పేసర్లు అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆ ఇద్దరూ టీమిండియా తరఫున ఆడుతుండటం గర్వంగా ఉందన్నాడు. అవేశ్, ప్రసిధ్లతో పాటు తమ ఫౌండేషన్ (ఎంఆర్ఎఫ్)కు చెందిన మరికొంతమంది యువ భారత పేసర్లు ఐపీఎల్లో భాగమైనందుకు తాను సంతోషిస్తున్నానని మెక్గ్రాత్ అన్నాడు.
మెక్గ్రాత్ ప్రస్తుతం చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్కు హెడ్గా వ్యవహరిస్తున్నాడు. అవేశ్, ప్రసిధ్లు గతంలో ఇక్కడ బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నవారే. కాగా ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్కు తాను హెడ్గా నియమితుడై పదేండ్లు గడుస్తున్న తరుణంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మెక్గ్రాత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో మా ఫౌండేషన్కు చెందిన 29 మంది బౌలర్లను చూడటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రసిధ్, అవేశ్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది..’ అని వ్యాఖ్యానించాడు. ఈ సంస్థలో డెన్నిస్ లిల్లీ నెలకొల్పిన ఆశయాలను కొనసాగించడమే తన ముందున్న లక్ష్యమని మెక్గ్రాత్ తెలిపాడు.
ఇక ప్రస్తుతం క్రికెట్లో జోరుగా చర్చ నడుస్తున్న వన్డే ఫార్మాట్పై మెక్గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనవరకైతే సంప్రదాయ టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. ‘నాకు టెస్టులన్నా, వన్డేలన్నా ఇష్టమే. కానీ నా దృష్టిలో టెస్టు క్రికెట్ అత్యుత్తమం. ఇది ఆటను కాపాడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. వన్డేల భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అయితే టీ20, టెస్టులతో పాటు ఈ ఫార్మాట్నూ ప్రోత్సహించాల్సిన అవసరముంది..’ అని మెక్గ్రాత్ చెప్పాడు.