హైదరాబాద్ : కొవిడ్ -19 నేపథ్యంలో గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునఃప్రారంభంపై గిరిజన శాఖ అధికారులతో మంత్రి గురువారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ వల్ల పాఠశాలలు మూత పడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారన్నారు. గురుకులాల్లో చేరడానికి చాలా డిమాండ్ ఉందని చెప్పారు. విద్యా సంస్థలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు.
గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలలో ఉండే గిరిజనుల ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్లో పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. గిరిదర్శిని కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు.
గ్రామాల్లో ఉన్న అంగన్ వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, గ్రామాల్లోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, అన్ని మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలకు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసీసీ) ద్వారా సమన్వయం చేయాలన్నారు. విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచే విధంగా హెల్త్ కమాండ్ సెంటర్ ను నిర్వహించాలన్నారు.
శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.