ఆ కుటుంబం ఎంతో గౌరవ మర్యాదలతో బతికేది. ఆ ఇంటి ఆడపడుచు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న అమ్మాయి తండ్రి గూండాలతో అల్లుడిని హత్య చేయించాడు. దీంతో ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొనడంతో పాటు ఛిన్నాభిన్నమయ్యాయి.
కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేని ఓ తండ్రి అల్లుడిపై పగ పెంచుకున్నాడు. సంవత్సరాలు గడిచినా పగతో రగిలిపోయాడు. ఆ దంపతులకు ఓ పాప పుట్టినా.. ప్రేమను పంచాల్సిన చోట కక్ష పెంచుకొని అల్లుడినిహతమార్చాడు.
తమ మతం కాకున్నా.. తమ ఇంటి ఆడబిడ్డను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో వరుడిపై కత్తి కట్టారు అమ్మాయి తరుపు బంధువులు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అతి దారుణంగా నరికి చంపేశారు.
ఇందులో మొదటిది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కాగా.. రెండోది యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్ కులోన్మాద హత్య..మూడోది రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బ్యాగరి నాగరాజు దారుణ హత్య. పై రెండింటిలో తండ్రులే విలన్లు కాగా.. సరూర్ నగర్లో జరిగిన ఘటనలో బాధితురాలి సోదరుడు హంతకుడిగా మారడం గమనార్హం. అయితే ఈ ఘటనలను పలువురు మానవతా వాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ప్రేమ పంచకపోయినా సరే.. కీడు మాత్రం తలపెట్టకండి అంటూ తమ అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)
ఆత్మీయతను పంచాలి..
కుల, మతాంతర వివాహాలు చేసుకుంటే.. నవ దంపతులపై జరుగుతున్న దాడులపై ప్రతిఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరువు కోసం పాకులాడుతూ అత్యంత పాశవికంగా హత్య చేస్తున్న వారు తమ ఆలోచనలను విడనాడాలని కోరుతున్నారు. పరువు పోయేది ఎప్పుడు? కూతురు నచ్చినవాడిని పెండ్లి చేసుకున్నప్పుడా.. లేక ఆమెను కట్టుకున్నోడిని చంపి నిందితుడిగా మారినప్పుడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిండైన జీవితాలను ఛిన్నాభిన్నం చేసే నిర్ణయాలను తుంచేయాలని పేర్కొంటున్నారు. ఆవేశాలు పక్కనపెట్టి అనురాగం, ఆత్మీయతను పంచే ఆలోచనతో ముందడుగు వేస్తేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని లేదంటే కుటుంబసభ్యులు అనాథలు, మానసికంగా కుంగిపోయి హంతకులుగా మారే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆశీర్వదిస్తేనే గౌరవం పెరుగుతుంది..
ప్రేమ వివాహాలు చేసుకున్న నవదంపతులను ఆశీర్వదిస్తేనే గౌరవంతో పాటు పరువును నిలబెట్టుకోవచ్చు. కానీ పగతో రగిలిపోతూ చంపుకుంటూ పోతే మిగిలేది శూన్యం. సమాజంలో కనబడని అంతరాలు ప్రేమకు, వివాహాలకు మాత్రం అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మూర్ఖపు ఆలోచనలను తుంచేయాలి. కొన్ని సార్లు మనుషులే మృగాల్లా మారి దాడులు చేస్తున్నారు. దీనంతటికి కారణం పురుషాధిక్య సమాజమనే చెప్పొచ్చు.
– శ్రీనివాస చారి, సీనియర్ సైకాలజీ అధ్యాపకుడు
హింసాత్మక ధోరణి వీడాలి..
ప్రతిఒక్కరూ హింసాత్మక ధోరణి విడనాడాలి. పిల్లలతో తల్లిదండ్రులు చనువుగా ఉంటూ సమాజాన్ని అవగతం చేయించాలి. అబ్బాయి ప్రేమ పెండ్లి చేసుకుంటే పోని పరువు.. కూతురు చేసుకుంటే ఎలా పోతుందో తల్లిదండ్రులు ఆలోచించాలి. మనుషుల మధ్య కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలిస్తే సమాజానికే చేటే.
– ప్రియాంక థామస్, మనోవిజ్ఞానశాస్త్ర అధ్యాపకురాలు
తల్లిదండ్రుల ఆలోచన మారాలి
అమ్మాయిలు స్వతంత్రంగా ఉంటే పరు వు పోతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అదే కొడుకు విషయానికి వస్తే నచ్చిన యువతిని పెండ్లి చేసుకుంటే స్వాగతిస్తున్న తల్లిదండ్రులు అమ్మాయి విషయంలో మాత్రం పగ పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్లో భయానక పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. కుల, మత, ప్రేమ వివాహాల జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయాలి. ఇందులో లా అండ్ ఆర్డర్, న్యాయ, మనో విజ్ఞాన శాస్త్ర కౌన్సిలర్లను చేర్చి నిరంతరం అవగాహన కల్పించాలి.
– వీరేందర్, ప్రముఖ సైకాలజీ కౌన్సెలర్
విలువల ఆధారిత విద్య ఉండాలి
సమాజాన్ని అంచనా వేసే విద్యను అందించాలి. ముఖ్యంగా పేర్ల వెనుక తోకలుండటం కూడా ఇలాంటి హత్యలకు కారణమవుతున్నాయి. అప్పట్లో ప్రణయ్, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్ , నిన్నమొన్న జరిగిన నాగరాజు హత్యలకు అదే కారణమయ్యింది. కృతజ్ఞతాపూర్వక, కలిసిమెలిసి ఉండే విధానాన్ని విరివిగా చెప్పగలిగితేనే కులోన్మాద, మతాంతర హత్యలను నివారించవచ్చు. సయ్యద్ అనగానే మేము ఉన్నతులమనుకోవడంతోనే నాగరాజు హత్య జరిగింది. అన్ని వర్గాలు ఆలోచించి కులాలు, మతాల కంటే మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
– ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హెచ్సీయూ
శాస్త్రీయ దృక్పథం అవసరం..
ఆధునిక యుగంలోనూ కులోన్మాద హత్యలు జరగడం శోచనీయం. కులం, మతం, వర్ణం, ప్రాంతం, భాష, ఆధిపత్యంతో వచ్చే గుర్తింపు అత్యంత ప్రమాదకరం. విద్యార్థి దశ నుంచే లౌకిక వాద స్ఫూర్తిని రగిలించాలి. ప్రతిఒక్కరిలో శాస్త్రీయ, హేతుబద్ధమైన అంశాలను పెంపొందించాలి. కుల, మత వ్యవస్థల అవినాభావ సంబంధంతోనే ఈ పరిస్థితులు సంభవిస్తున్నాయి.
– ప్రొఫెసర్ గణేశ్, సమాజశాస్త్ర విశ్లేషకుడు
విడదీసి కష్టాల్లో పడేయొద్దు..
ప్రపంచంలో మానవత్వానికి మించింది ఏమీలేదు. కులాలు, మతాలు మానవుడు సృష్టించుకున్నవే. వాటిని నమ్మకాల కోసమే ఆచరించాలి. అంతేతప్ప వాటి పేరు చెప్పి ప్రాణాలు తీయవద్దు. మేం 2008లో మతాంతర వివాహం చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు కౌన్సిలింగ్ ఇప్పించి ఒప్పించాం. మనిషికి మనిషి తోడుంటేనే సమాజం నడిచేది. ప్రస్తుతం మా కుటుంబంలో ఒకరికొకరం గౌరవంగా పలుకరించుకుంటున్నాం. ఇరు కుటుంబాల మతాలు వేరైనా ఒకరి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకుంటున్నాం. ఇష్టపడి పెండ్లి చేసుకుంటే వీడదీసి కష్టాల్లో పడేయవద్దని కోరుకుంటున్నాం.
– కావ్యకృష్ణ, దంపతులు