పటాన్చెరు, జూలై 27 : దివంగత రాష్ట్రపతి, మిసైల్మెన్ ఏపీజే అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడుద్దామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. బుధవారం పటాన్చెరు అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో కలాం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హైస్కూల్, ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కలాం జీవితాన్ని పరిశీలించాలన్నారు.
తల్లిదండ్రులు నిరుపేదలుగా ఉన్నా కూడా చదువుకోవాలనే లక్ష్యం మేరకు రోజూ ఇంటింటికీ పేపర్లు వేసి చదువుకున్నారని గుర్తుచేశారు. విద్యార్థి దశనుంచి జీవితంలో రాణించాలనే పట్టుదల ఉండాలన్నారు. పెద్ద పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలన్నారు. ప్రతివిద్యార్థిలో ప్రతిభ ఉంటుందన్నారు. వారు సరిగ్గా వినియోగించుకుంటే అన్నిరంగాల్లో వృద్ధి చెందుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నదని, సర్కారు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని కోరారు. తాను సొంత నిధులతో నోటుపుస్తకాలు అందజేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, అశోక్, షకీల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.