హైదరాబాద్ : భైంసాలో సాధరణ పరిస్థితులు నెలకొనాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రజలు సంయమనం పాటించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్ణ్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఎవరూ రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్నారు. సాధారణ ప్రజలకు నష్టం కలిగేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎవరు ఎలాంటి పుకార్లను నమ్మొద్దన్నారు.
పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భైంసా అల్లర్లకు కారకులైన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా రాజకీయ పార్టీలు, ఇరువర్గాల ప్రజలు, ఇతర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరముందన్నారు. భైంసా ఘటనపై ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో ఎప్పటికప్పుడు మంత్రి ఇంపరిస్థితిని సమీక్షిస్తునే ఉన్నారు.
జర్నలిస్టులపై దాడిని ఖండించిన మంత్రి
భైంసాలో జర్నలిస్టులపై దాడులు జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరన్ రెడ్డి అన్నారు. భైంసా ఘటనలో గాయపడ్డ జర్నలిస్టులను మంత్రి ఫోన్లో పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి విజయ్ సోదరుడితో మంత్రి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదే ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు జర్నలిస్టులు ప్రభాకర్, రవితో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, వారికి ధైర్యం చెప్పారు.