హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అతివేగమో…ఎదుటివారి నిర్లక్ష్యమోగానీ ఏటా వేల సంఖ్యలో ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక 2021ని ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,03,116 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 1,55,622 మంది దుర్మరణం చెందారు.
వీరిలో 69, 240 (44.5శాతం) మంది ద్విచక్రవాహనదారులేనని నివేదిక వెల్లడించింది. అత్యాధునిక భద్రతా వసతులు ఉన్నా, అతివేగం కారణంగా కార్లు, జీపులు, ఎస్యూవీ వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మృతిచెందుతున్న వారు 15.1శాతం ఉంటున్నారని పేర్కొన్నది. కాగా, 2020లో 3,54,796 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే 1,33,201 మంది దుర్మరణం చెందినట్టు ఎన్సీఆర్బీ తన నివేదిక ద్వారా తెలియజేసింది.