హైదరాబాద్ : భావితరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించాలంటే మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. కరోనా నేపథ్యంలో ముందే ప్రకటించిన విధంగా జన్మదిన వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపాలని అనుకున్న వారు మొక్క నాటితే చాలని ఆయన ఇచ్చిన పిలుపునకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ స్పందన లభించింది. అందులో భాగంగా రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కో సబ్ స్టేషన్లో సంఘం ఆధ్వర్యంలో 56 మొక్కలు నాటి వినూత్న రీతిలో మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి జగదీష్ రెడ్డి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, 1104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి 56వ జన్నదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో 56 మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్ఈ కార్యాలయంలోనూ ఉద్యోగ సంఘాల నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు శివకుమార్, ఎంఏ మాజిద్, విద్యుత్ శాఖ ఏడీ శంకరయ్య 1104, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి నాయకులు పర్వతాలు, మల్లేష్, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.