సిద్దిపేట : స్వచ్ఛ సిద్దిపేట ఉద్యమంలో ప్రతి పౌరుడూ కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని విలీన వార్డులతో పాటు కొత్త వార్డుల ప్రజలందరి సౌలభ్యం కోసం ఇంటింటా చెత్త సేకరించేందుకు తీసుకువచ్చిన వాహనాలను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.63లక్షల వ్యయంతో ఆరు డో టూ డోర్ చెత్త సేకరణ వాహనాలను తెప్పించినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా సిద్దిపేట స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ ‘శుద్ధిపేట’కు ప్రతి పౌరుడు కదిలిరావాలన్నారు. సిద్ధిపేట మున్సిపాలిటీ అంటే మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బందిదే కాదు ప్రజలపై సైతం గురుతర బాధ్యత ఉందన్నారు. ఆ బాధ్యతను గుర్తించి స్వచ్చ సిద్దిపేట కోసం నడుం బిగించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణకై మరింత మెరుగు కోసమే నా తాపత్రయమని, పట్టణంలో పెరిగిన వార్డులు, పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పటికే ఉన్న చెత్త సేకరణ వాహనాలకు తోడుగా మరో ఆరు వాహనాలను ప్రారంభించినట్లు చెప్పారు.
మరో మూడు వాహనాల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారిని మంత్రి ఆదేశించారు. అన్నీ వార్డుల్లో నుంచి ప్రతి ఇంటికి చెత్త సేకరణ వాహనం వెళ్లి ప్రజలకు చేరాలన్నదే మా లక్ష్యం అన్నారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమేనని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి.. మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందివ్వాలన్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా, పెరిగిన వార్డులకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాల సంఖ్య పెంచడం జరిగిందని, ఇకపై ప్రతి ఇంటికి చెత్త సేకరణ వాహనం వస్తుందన్నారు.
స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్దిపేటలోని స్వచ్ఛ బడిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను ఎలా ఎరువుగా మార్చాలో స్వచ్ఛ బడిలో వివరిస్తారన్నారు. పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడు.. ఇంటింట్లి పాది వెళ్లి స్వచ్ఛబడి సందర్శించాలన్నారు. వార్డుల వారీగా బ్యాచులువారీగా వెళ్లాలని, ఇందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ రమణాచారి, సుడా డైరెక్టర్ వేణుగోపాల్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.