(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘ఆరంభ శూరత్వం..’ అనే నానుడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వచనంలాగా మారిపోయింది. 2022 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామన్న 40 హామీల్లో ఇప్పటివరకూ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేకపోయిన ప్రధాని నరేంద్రమోదీ.. తన మానస పుత్రికగా అభివర్ణించిన ‘పీఎం-వాణి’ (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్) పథకాన్ని కూడా మధ్యలోనే గాలికొదిలేశారు. రెండేండ్లు గడిచినప్పటికీ, నిర్దేశిత లక్ష్యంలో 1.3 శాతం పనులు కూడా పూర్తికాకపోవడమే దీనికి సాక్ష్యం.
చౌక ఇంటర్నెటే లక్ష్యంగా..
దేశంలోని ప్రతి గ్రామానికి అత్యంత చౌకగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో 2020 డిసెంబర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ‘పీఎం-వాణి’ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఒక కోటి వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే, నవంబర్ 29 నాటికి కేవలం 1,32,508 హాట్స్పాట్లనే (1.3 శాతం) ఏర్పాటు చేయడం గమనార్హం. హాట్స్పాట్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల విడుదలలో జాప్యం కారణంగానే పనులు నెమ్మదించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎం-వాణి’ స్కీమ్ అమలు కోసం పబ్లిక్ డాటా ఆఫీస్లను (పీడీవో) ఏర్పాటు చేయాల్సిందిగా బీఎస్ఎన్ఎల్కు కేంద్రం బాధ్యతలు అప్పగించింది. అయితే, వీఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం, సంస్థకు నిధుల కోత, టెండర్లలో జాప్యం సహా బీఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్కు కేంద్రం యత్నించడం.. వెరసి పీడీవోల ఏర్పాటు ప్రక్రియ పడకేసింది. హాట్స్పాట్ల ఏర్పాటులో కూడా రైల్వేశాఖ నుంచి సరైన స్పందన కరువైంది. దీంతో ‘పీఎం-వాణి’ స్కీమ్ అటకెక్కింది. బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేయడానికి యత్నించడమే ‘పీఎం-వాణి’ పథకం వైఫల్యానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.