సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన తయారీకి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈవీ పాలసీని ప్రత్యేకంగా అమలు చేస్తుండగా, తాజాగా ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో మొట్ట మొదటిసారిగా ఈవీ ట్రేడ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్రెడ్కో సంస్థలతో కలిసి ది ట్రేడ్ షో కంపెనీ రెండు రోజుల పాటు ఈవీ ఎక్స్పోను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ రంగానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్టార్టప్లతో కలిసి పనిచేసేందుకు వేదికగా ఈవీ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని నిర్వాహకుల్లో ఒకరైన సుచరితా రావు తెలిపారు. ఎక్స్పోను రెండు రోజుల పాటు హైటెక్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని చెప్పారు.