హేగ్ : కొవిడ్ టీకాతో రక్తం గడ్డకడుతుందన్న భయాల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల పంపిణీ నిలివేయాలని అమెరికా ఆరోగ్య అధికారులు సిఫారసు చేశారు. ఈ క్రమంలో యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ సైతం కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ భద్రతపై సిఫారసు చేస్తామని ఆమ్స్టర్డామ్కు చెందిన యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ బుధవారం తెలిపింది. వ్యాక్సిన్పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా.. వచ్చే వారంలో భద్రతపై సిఫారసులు జారీ చేయాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సమీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ను నివారించడంలో టీకా ప్రయోజనాలు, దుష్ప్రభావాల ప్రమాదాలను అధిగమిస్తాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అభిప్రాయపడింది.
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మంగళవారం అమెరికాలో అరుదుగా ఆరుగురిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదించగా.. వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం యూరప్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వినియోగానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం యూరోపియన్ ఆరోగ్యశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడడంతో వ్యాక్సిన్ వినియోగంపై యూరోపియన్ ఆదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా టీకాతో చాలా అరుదుగా జరుగుతున్న రక్తం గడ్డకట్టే కేసులపై పరిశోధన కొనసాగుతోందని ఈఎంఏ తెలిపింది.
ఇవికూడా చదవండి..