హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఈటల అతిగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. ఈటల తన గురించి ఎక్కువగా ఊహించుకొంటున్నారని, టీఆర్ఎస్, కేసీఆర్ లేకుంటే ఈటలకు డ్రెస్.. అడ్రస్ లేదని గుర్తు చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జాజుల సురేందర్, ముఠా గోపాల్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి సుమన్ మాట్లాడుతూ సర్పంచ్ కూడా కానీ ఈటలను రెండు సార్లు మంత్రిగా చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004 కు ముందు ఈటల అడ్రస్ ఎకడని ప్రశ్నించారు.
ఈటల శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్య, ఆర్థిక మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డారని, పేదల భూములు అక్రమించారని తెలిపారు. హుజూరాబాద్లో ఓటమి తప్పదనే.. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటల ఓ చెల్లని రూపాయంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవులు, రాజకీయాలు తప్ప బీజేపీ, కాంగ్రెస్కు వరదల్లో ప్రజల గోస పట్టడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల హుజూరాబాద్లో పోటీచేసి రేవంత్ సాయంతో గెలిచారని తెలిపారు. ఈటల నల్లికుట్ల రాజకీయాలు తెలంగాణలో నడవవని, మోదీకి, అమిత్షాకు గులాంలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకొంటున్న ఈటలకు కనీసం వార్డు మెంబర్ కూడా టచ్లో లేరని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్లో చేరికలుంటాయని సుమన్ చెప్పారు.
ఈటలది వ్యాపార నైజం.. గువ్వల
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈటలది వ్యాపార నైజమని, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని మండిపడ్డారు. ఈటల అహంకారంతో బడుగు బలహీన వర్గాల దొరలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈటల పిట్టల దొరలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎద్దేవా చేశారు. ఈటల పెద్ద బ్రోకర్లా మారాడని, పైకి ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ కాదు.. ఈటల రాజేందర్రెడ్డి, ఆధార్ కార్డులో సందర్భాన్ని బట్టి తన పేరును రెడ్డిగా పెట్టుకున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధారాలను బయటపెట్టారు. తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఈటల కుట్ర, రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.