హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నవజాత శిశువులకు అత్యాధునిక వైద్యం అందించటంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు నిలోఫర్ దవాఖానలో ‘జ్ఞానదా నియోనాటల్ స్కిల్ ల్యాబ్’ పేరుతో శిక్షణ కేంద్రం నిర్మించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రం దక్షిణ భారత ప్రభుత్వ దవాఖానల్లోనే మొదటిది కావటం విశేషం. ఆధునిక వైద్య పరికరాలను ఉపయోగించి అప్పుడే పుట్టిన శిశువులకు వైద్యం చేయటంలో చిన్నపిల్లల వైద్యనిపుణులు, పీజీ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇస్తామని నేషనల్ నియోనాటల్ ఫోరం (ఎన్ఎన్ఎఫ్) తెలంగాణ స్టేట్ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, నిలోఫర్ దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ రమేశ్బాబు దాంపురి తెలిపారు. ఈ ల్యాబ్ నిర్మాణానికి ఎన్ఎన్ఎఫ్ రూ.42 లక్షలు, ఫీనిక్స్ మెడికల్ సిస్టమ్స్ రూ.5 లక్షలు, జీల్ మెడికల్స్ రూ.3 లక్షలు నిధులు సమకూర్చాయని చెప్పారు. ఇలాంటి ల్యాబ్ ఢిల్లీ, మణిపూర్ ఎయిమ్స్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ల్యాబ్లో అందుబాటులో ఉన్న పరికరాలు
ఫొటో థెరపీ, వెంటిలేటర్, సీ-పాప్, బెస్ట్ పంప్,ఐవీ-లైన్, మ్యానిక్విన్స్ (శిశువులను పోలిన బొమ్మలు)
మ్యానిక్విల్స్పై శిక్షణ ఇస్తాం
నవజాత శిశువులకు చికిత్స చేయడం సులువు కాదు. జాగ్రతగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. శిశువులకు ఐవీ లైన్స్ పెట్టడం, ఇంజెక్షన్ ఇవ్వడం, వెంటిలెటర్, ఫొటో థెరపీ, వార్మర్స్, సీ-పాప్ తదితర పరికరాలతో చికిత్స చేయడానికి ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఈ ల్యాబ్లో ముందుగా శిశువులను పోలిన బొమ్మల (మ్యానిక్విన్స్)పై శిక్షణ ఇస్తాం. పూర్తిస్థాయిలో నైపుణ్యాలు సాధించిన తర్వాత నేరుగా శిశువులకు చికిత్స అందించేలా శిక్షణ ఇస్తాం.
-డాక్టర్ రమేశ్బాబు దాంపురి