హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళా సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారన్నారు. సంఘాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళా శక్తిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.1698 కోట్లు కేటాయించారని చెప్పారు.