ముంబై: చెట్టు నరికివేతను ప్రశ్నించినందుకు పర్యావరణ కార్యకర్తపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. పర్యావరణ కార్యకర్త అభయ్ ఆజాద్కు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ఇంటి సమీపంలో ఒక చెట్టును నరికివేస్తున్నట్లు అందులో ఉన్నది. దీంతో ఆజాద్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్టు నరుకుతున్న సిబ్బందిని ఆయన నిలదీశారు. దానికి అనుమతి ఉన్నదా అని ప్రశ్నించారు. సంబంధిత పత్రాలు చూపించమని అడిగారు.
కాగా, చెట్టును నరుకుతున్న సిబ్బందిని ప్రశ్నించిన పర్యావరణ కార్యకర్త అభయ్ ఆజాద్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన ముంబై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. స్థానికులు తమ మొబైల్లో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మూడేండ్ల కిందట మరో పర్యావరణ కార్యకర్తతో కలిసి ఆ చెట్టును కాపాడాలంటూ అధికారులను కోరినట్లు అభయ్ ఆజాద్ తెలిపారు. అయితే తాజాగా బీఎంసీ అధికారులు అక్కడకు వచ్చి ఆ చెట్టును నరికివేయడాన్ని తాను సహించలేకపోయినట్లు ఆ హరిత కార్యకర్త వాపోయారు. మరోవైపు అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించినందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.