న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల గడువు ముగింపు తేదీకి దగ్గరపడుతున్నందున దృష్టిలో పెట్టుకొని లేఖ రాసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. 178కోట్ల డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 21,83,976 డోసులు వేసినట్లు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రాలు కేంద పాలిత ప్రాంతాల్లో 15కోట్లకుపైగా డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో కొత్తగా 6,561 కొవిడ్ -19 కేసులు రికార్డవగా.. 142 మరణాలు రికార్డయ్యాయి. కొత్తగా 14,947 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 77,152 ఉన్నాయని వివరించింది.