హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమశాఖ భావిస్తున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 326 ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (స్టార్స్)గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధంచేసింది. 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కూడా మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్చాలని భావిస్తున్నది. ఈ మొత్తం 1,758 స్కూల్స్లో దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియం బోధనలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ పాఠశాలల విద్యార్థులు నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. వీరిలాగే ఏజెన్సీ, అటవీ ప్రాంతాల విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు గిరిజన, స్త్రీశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.