హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పేద, ధనిక తేడాలు సమసిపోతాయని అంటున్నారు జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి. సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న ‘మన ఊరు- మన బడి’ పథకంతో ఎంతోమంది పేదలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోగలుగుతారని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మీడియం చదువుల వల్ల లాభనష్టాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంగ్లిష్ చదువులతోనే యువత అభివృద్ధి
యువత అభివృద్ధి చెందాలంటే ఇంగ్లిష్ మీడియం చదువులు అవసరం. తెలుగు మీడియంలో చదువుకొన్న యువతకు పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నా, ఇంగ్లిష్ మీడియం వారిముందు నిలవలేకపోతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివినవాళ్లు జీవితంలో త్వరగా స్థిరపడుతున్నారు. సొంత వ్యాపారాలు చేసుకోవడానికీ ఇంగ్లిష్ మనోధైర్యం ఇస్తుంది. వ్యాపారాల కోసం బ్యాంకులు, ఇతర లావాదేవీలు చేసే సందర్భంలో ఇంగ్లిష్ అండగా నిలుస్తున్నది. ఈ విషయాన్ని గమనించే సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.
ఆంగ్లంతో పేదరిక నిర్మూలన సాధ్యం
పేదరికాన్ని నిర్మూలించాలంటే తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటు స్కూళ్లలో నాణ్యతాప్రమాణాలు లేకపోయినా ఇంగ్లిష్ మీడియం వాతావరణంలో చదువుకోవడంతో విద్యార్థుల్లో సహజంగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతున్నది. దీంతో త్వరితగతినవారు కోరుకున్న కాలేజీల్లో, ఐఐటీ, ఎన్ఐటీ, పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజీల్లో, కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు సాధిస్తున్నారు. కేవలం ఇంగ్లిష్ మీడియం వారికే అందుబాటులో ఉండే ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్చర్ వంటి వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించిన వారికే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తే వాళ్లూ గొప్పగా ఎదుగుతారు. ధనిక, పేద వర్గాలు సమసిపోతాయి. సమాజంలో సమానత్వం పెరుగుతుంది.
డిజిటల్ యుగంలో ఇంగ్లిష్దే హవా
ప్రస్తుతం అంతా గ్లోబలైజేషన్, డిజిటలైజేషనే. అలాంటిది ఇంకా తెలుగు మీడియంలో బోధన వెనుకబాటుతనానికి నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఇంగ్లిష్కు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. భారత్లో మాత్రం ప్రాంతీయ భాషలోనే 80 శాతం విద్యాబోధన చేస్తున్నారు. ఇంగ్లిష్మీడియంలో చదువుకొన్నవారు ఉన్నత స్థానాలు అధిరోహిస్తూ, పారిశ్రామిక వేత్తలుగా, బడా వ్యాపారవేత్తలుగా, సాఫ్ట్వేర్ దిగ్గజాలుగా ఎదుగుతున్నారు. కానీ తెలుగు మీడియం వారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చేస్తూ సమయాన్ని వృథా చేసుకొంటున్నారు. తెలుగు భాష, సంస్కృతిని విస్మరించకుండా నిర్ణయం తీసుకొని ముందుకుసాగాలి. ఇంగ్ల్లిష్లో బోధనతో పాటు, ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు భాషపై పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకోవాలి.
తెలుగు మీడియం వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ
తెలుగు మీడియంలో చదువుకొన్న విద్యార్థులు యూజీలు, పీజీలు చేసినా ఫలితం ఉండటం లేదు. వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత విద్య కోసం ఇంగ్లిష్ దరఖాస్తులను కూడా సరిగ్గా నింపలేకపోతున్నారు. పరిశోధనలు చేయలేకపోతున్నారు. ఇంగ్లిష్లో మాట్లాడలేకపోతున్నారు. ఆంగ్లంలో మెటీరియల్ సేకరించలేకపోతున్నారు. దీనికి కారణం.. ఇంగ్లిష్ను సరిగా అర్థంచేసుకోకపోవటమే. ఫార్మా, బ్యాంకింగ్, బీమా, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి వాటిల్లోనూ ఇంగ్లిష్ మీడియం వారే ఎదుగుతున్నారు. కొంతమంది టీచర్లు, లెక్చరర్లు కూడా ఇంగ్లిష్లో బోధన చేయలేకపోతున్నారు. టీచింగ్ సిబ్బందికి కూడా ఇంగ్ల్లిష్ పరిజ్ఞానం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.