తిరువనంతపురం : కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు బీటెక్ ఛాయ్ పేరుతో టీ దుకాణం తెరిచి జీవితంలో నిలదొక్కుకున్నారు. కేరళలోని కొల్లాం జిల్లా పల్లిముక్కు పట్టణం సమీపంలో ఎన్హెచ్ 66పై దూసుకెళ్లే వాహనదారులను, అటుగా వెళ్లే ప్రయాణీకులను తోపుడుబండిపై ముగ్గరు యువకులు ఏర్పాటు చేసిన బీటెక్ ఛాయ్ ఆకట్టుకుంటుంది. 50 ఫ్లేవర్లలో వీరు అందించే గరం ఛాయ్ గొంతులో పోసుకుని వారంతా సేదతీరుతుంటారు.
వినూత్న కాన్సెప్ట్తో ఈ టీ స్టాల్ను ఆనందు అజయ్, మహ్మద్ షమీ, ఆయన సోదరుడు మహ్మద్ షానవాజ్ ఏర్పాటు చేశారు. హైవేపై టీ స్టాల్స్ కోకొల్లలుగా ఉంటాయని వినూత్నంగా ఉంటేనే ఆదరణ దక్కుతుందని తాము అనుకున్నామని, ఆపై తాము ముగ్గురూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావడంతో బీటెక్ ఛాయ్ అనే పేరు ఎంచుకున్నామని టీస్టాల్ నిర్వాహకుల్లో ఒకరైన ఆనందు అజయ్ చెప్పుకొచ్చారు. కొవిడ్-19 లాక్డౌన్తో తమ ఉద్యోగాలు కోల్పోవడంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నామని, పుడ్ బిజినెస్పైనే తాము దృష్టిసారించామని అన్నారు.
పెట్టుబడి పరిమితంగా ఉండటంతో తోపుడుబండిపై బీటెక్ ఛాయ్ను చేపట్టామని తెలిపారు. స్నేహితుల నుంచి అప్పుగా తీసుకున్న రూ 1.5 లక్షలతో బిటెక్ ఛాయ్ను ప్రారంభించామని చెప్పారు. టీ దుకాణం తెరిచిన నెల రోజులకే బీటెక్ ఛాయ్ ఘుమఘుమలు ఈ ప్రాంతమంతా పాకాయి. ఇక్కడ లభించే పలు రకాల టీలను ఆస్వాదించి స్నాక్స్ రుచిచూసేందుకు ప్రజలు బారులు తీరారు.
నాణ్యతతో రాజీపడకుండా టీలను తయారు చేసి అందించడంతోనే తమ దుకాణానికి ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని షమీ అంటారు. తాము విక్రయించే స్నాక్స్ స్ధానికంగా సేకరించిన పదార్ధాలతో ఇంటి నుంచి తయారుచేసినవని వారు చెబుతున్నారు. బేసిక్ బ్లాక్ టీ రూ 5 నుంచి రూ 45కు లభించే కుంకుమపువ్వు టీ వరకూ అందుబాటు ధరల్లో రుచికరమైన టీలను అందించడం వల్లే బీటెక్ చాయ్ పాపులర్ అయింది.