మేడ్చల్ రూరల్, మార్చి 2: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి, అతి తక్కువ వ్యయంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. హెచ్వోడీ రాజేశ్వరన్ ఆర్థిక సహకారం, అధ్యాపకురాలు డాక్టర్ సరళ మార్గదర్శనంలో ట్రిపుల్ ఈ తృతీయ సంవత్సరం విద్యార్థి షేక్ బాజీబాబా సారథ్యంలో విద్యార్థులు ఈ బైక్ను రూపొందించారు. దీని తయారీకి రూ. 20వేల వరకు ఖర్చయిందని తెలిపారు. దీనికి అమర్చిన బ్యాటరీని ఆరు గంటలపాటు చార్జీ చేస్తే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వెళ్తుందని చెప్పారు. బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచితే ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో కూడా వెళ్లవచ్చన్నారు. హర్షవర్దన్ రెడ్డి, అనీష్, పతాంజలి, వంశీ, లక్ష్మిలిఖిత విద్యార్థి బృందంలో ఉన్నారు. ఈ బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామిరెడ్డి అభినందించారు.