న్యూఢిల్లీ: ఇకపై ఇంజినీరింగ్ కోర్సుల బోధన ఐదు భాషల్లో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు హిందీతోపాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ ప్రాంతీయ భాషల్లో విద్యను అందిస్తాయని చెప్పడానికి తాను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అనువదించడానికి ఒక సాధనాన్ని కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రాంతీయ భాషలలో ఇంజినీరింగ్ విద్యను ప్రారంభించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు చెప్పారు. పేదలు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు ఇది ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఎన్ఈపీ 2020 ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ నూతన విద్యా విధానాన్ని అమలుచేయడాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా విద్యాపరంగా పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 1వ తరగతి విద్యార్థుల కోసం విద్యాప్రవేష్, సీబీఎస్ఈ స్కూళ్లలో 3,5,8వ తరగతుల కోసం అమలు చేసే సఫల్ కార్యక్రమం, దివ్యాంగుల కోసం పాఠ్యాంశంగా భారతీయ సంకేత భాష, నిష్ట 2.0, ప్రజల అవగాహన కోసం ఏఐ వెబ్సైట్, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ప్రాంతీయ భాషల్లో 1వ సంవత్సరం ఇంజనీరింగ్ కార్యక్రమాలు, ఎన్డిఎఆర్ & ఎన్టిఎఫ్ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కార్యక్రమం మన యువకుల భవిష్యత్కు ఆధారంగా నిలుస్తుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యారంగానికి చెందిన వారు పాల్గొన్నారు.