వనపర్తి టౌన్, మే 23: ఈ విద్యాసంవత్సరం నుంచే వనపర్తి పీజీ కళాశాలలో ఇంజినీరింగ్ తరగతులు నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో జేఎన్టీయూ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీరింగ్ కళాశాల పరిపాలనా విభాగం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కళాశాల భవనం నిర్మాణమయ్యే వరకు పీజీ కళాశాలలో తరగతుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం 300 సీట్లతో ఇంజినీరింగ్, 60 సీట్లతో బీఫార్మసీ తరగతులు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్లో సీఎస్ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీఈ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ కోర్సులు ప్రారంభించనున్నట్టు వివరించారు. అధికారులతో చర్చించి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్ను మంత్రి ఆమోదించారు. సమావేశంలో వీసీ కట్ట నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మన్సూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.