మహబూబాబాద్ : కబడ్డీ గ్రామీణ క్రీడ. గతంలో కబడ్డీకి యమా క్రేజీ ఉండేది. ఈ ఆటను బాగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పరంగా కబడ్డీని ప్రొత్సహించే విధంగా సీఎం కేసీఆర్తో మాట్లాడనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గత నాలుగు రోజులుగా నిర్వహించిన 47వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. మొత్తం 500 మంది బాలబాలికల క్రీడాకారులు వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
స్వతహాగా కబడ్డీ ప్లేయర్ అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కబడ్డీ పోటీలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతా కలిసి కబడ్డీకి పూర్వ వైభవం తెద్దామన్నారు. కోచింగ్ క్యాంప్ నిర్వహణకు కూడా సాయంగా ఉంటానన్నారు. స్థానికంగా ప్రజా ప్రతినిధులు క్రీడా నిర్వాహకులకు సహకరించాలన్నారు.