ప్రస్తుతం ఇంగ్లిష్ అత్యవసరం
ప్రభుత్వ ఆలోచన ఎంతో మంచిది
బలహీనవర్గాలు బాగుపడుతాయి
గురుకులాలే ఆదర్శంగా ముందుకెళ్లాలి
‘నమస్తే తెలంగాణ’తో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ అత్యవసరమని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తెలిపారు. ఇంగ్లీష్తోనే అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారీ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో పాటు, మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను బాగుచేయాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. అవసరమైన విద్యార్థులకు తెలుగులో చదువుకునే అవకాశం కల్పిస్తూనే ఇంగ్లిష్ మీడియంను అమలుచేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఈ రెండు ఆలోచనలు ఎంతో మంచివని ప్రశంసించారు. ఈ రెండు కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలి? వీటివల్ల విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ఆ విశేషాలు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాటల్లోనే..
పోటీ ప్రపంచంలో గెలవాలంటే ఇంగ్లిష్ అవసరం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలిచి గెలవాలంటే విద్యార్థులకు ఇంగ్లిష్ అవసరం ఏర్పడింది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఇంగ్లిష్ కూడా ఒక కారణం. నా చిన్నతనంలో 7వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అవకాశం దొరికి ఇక్కడి వరకు రాగలిగా. ఈ కాలంలోనూ విద్యార్థులకు ఆ ఇబ్బందులు ఉండొద్దు. ప్రతి పేద విద్యార్థికి సులువుగా ఇంగ్లిష్ విద్య అందాలి. ప్రస్తుతం ఇంగ్లిష్ ఉంటేనే ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితి ఉన్నది. సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నా ఇంగ్లిష్ అవసరం ఏర్పడింది. పిల్లలు ఉన్నతస్థానాలకు ఎదగాలంటే ఇంగ్లిష్ కావాలి. ఇంగ్లిష్ రావాలంటే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయాలి.
ప్రభుత్వ బడులకు ఊతం
ప్రభుత్వ పాఠశాలలపై అన్ని వర్గాల్లోనూ చిన్నచూపు ఉన్నది. పేదలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి పెరగడం ఒకటైతే, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమి మరో కారణం. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని భావిస్తున్నా. ఇంగ్లిష్ మీడియం, బడుల ఆధునికీకరణ కార్యక్రమాలు ప్రభుత్వ బడులకు ప్రాణం పోస్తాయనే నమ్మకం ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటాయి. అవి బాగుపడితే పేదలకు ఊరట లభిస్తుంది. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరిక తీరుతుంది. పేదలకు చదువు విలువ తెలియడంతో తమ పిల్లల్ని ఉన్నతస్థానాల్లో చూసుకునేందుకు ఇంగ్లిష్ మీడియం వైపు వెళ్తున్నారు. అయితే ఇది వారికి ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తున్నది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకుపోవాలి.
గురుకులాలే ఆదర్శంగా..
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పేందుకు గురుకుల విద్యాలయాలే ప్రత్యక్ష ఉదాహరణ. మన ఊరు-మన బడి కార్యక్రమానికి మరే రాష్ట్రం మోడల్ అవసరం లేదు. మన గురుకులాలనే ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలోని గురుకులాలు విప్లవాన్ని సృష్టించాయి. పేదపిల్లలకు భోజనం, వసతితో పాటు మంచి విద్యను అందించగలుగుతున్నాయి. ఇప్పుడా పిల్లలు వారి ఇండ్లలో కన్నా స్కూళ్లలో ఉండేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు.
బడులను ఆకర్షణీయంగా మార్చాలి
ముందు విద్యార్థులకు బడికి రావాలనే ఆసక్తి పెంచాలి. ఇందుకు పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. తరగతి గదులు, టాయ్లెట్స్ ఏర్పాటుచేయాలి. ఆట-పాటలకు అవకాశం కల్పించాలి. ప్రతి సబ్జెక్ట్కు ఒక టీచర్ ఉండేలా చూడాలి. ఇంగ్లిష్ మీడియంను విజయవంతం చేయాలంటే ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇంగ్లిష్ మీడియం టీచర్లను భర్తీ చేయాలి. పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ఈ కార్యక్రమంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రతి అంశం పురోగతిపై అసెస్మెంట్ చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి.
కేంద్రం నిర్ణయం దుర్మార్గం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా పెట్టాలని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా దీనిని తొలగించింది. విద్యార్థులకు మంచి పౌష్టికాహారంతో పాటు హాజరుశాతం పెంచేందుకు ఉదయం టిఫిన్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టాలి. తెలంగాణలో కొన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్గా మార్చి ఈ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది.