అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగుల సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మూడేండ్లు అయిన కాలయాపన చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు.
‘‘ మాట తప్పకు మడమ తిప్పకు , ఒకటే సర్వీసు-ఒకే పెన్షన్ ’’ విధానాన్ని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం జీపీఎస్ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని దీనిని తామంతా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సీపీఎస్ కంటే జీపీఎస్ దగా కోరు పెన్షన్ అని మండిపడ్డారు. రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు.