అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. 11వ పీఆర్సీలో అంగీకరించిన వాటిపై ఉత్తర్వుల అమలులో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. గత్యంతరం లేకే ప్రభుత్వంతో పీఆర్సీని అంగీకరించామని గుర్తు చేశారు. వేతన సవరణపై ఎవరూ సంతృప్తికరంగా లేరని అన్నారు.
ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. సీపీఎస్రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. మే 5న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికైన ప్రభుత్వం అంగీకరించిన వాటికి ఉత్తర్వులు ఇవ్వాలని, పీఆర్సీతో సంబంధం లేని వాటికి ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాత పింఛన్ విధానాన్ని కొనసాగిస్తామని ఇచ్చిన హామీపై మాట్లాడడం లేదని తెలిపారు. సీఎం తన రాజకీయ విశ్వాసనీయతను కాపాడుకోవాలని సూచించారు.