Home Loan EMI Costly | పెరిగిపోతున్న ధరలను కట్టడి చేయడంతోపాటు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల బాటలోనే భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అడుగులేస్తున్నది. ద్రవ్యపరపతి విధానంపై జరిగిన సమీక్షలో ఐదు నెలల్లో నాలుగు సార్లు కీలక రెపోరేట్లు పెంచేసింది. తాజాగా 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో ఆర్బీఐ రెపోరేట్ 5.90 శాతానికి దూసుకెళ్లింది. తక్షణం అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఫలితంగా ఇండ్ల రుణాలతో సహా అన్ని రకాల లోన్లు పిరం కానున్నాయి.
ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేశాయి. గత మే నాలుగో తేదీకి ముందు రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష భారీ షాక్. వివిధ బ్యాంకుల వడ్డీరేట్లు 6.6 శాతం నుంచి 8.5 శాతానికి సవరించాయి. దీంతో లోన్ టెన్యూర్ పెంచుకోవడానికి అవకాశాల్లేని రుణ గ్రహీతలపై నెలవారీ వాయిదాల భారం.. అంటే ఈఎంఐ 15 శాతం పెరుగుతుంది. భవిష్యత్లోనూ వడ్డీరేట్లు మళ్లీ పెంచక తప్పదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. 2019 స్థాయికి ద్రవ్యోల్బణం తీసుకొచ్చే వరకు రెపోరేట్ సర్దుబాటు తప్పదన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలపై బెంచ్ మార్క్ వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్ లింక్డ్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్పై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడే నిర్ణయం తీసుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శనివారం నుంచి 50 బీపీఎస్ వడ్డీ పెంచుతున్నట్లు తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ శుక్రవారమే వడ్డీరేట్లు పెంచివేసింది. కనుక ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ఆధారిత ఇండ్ల రుణాలపై ఈఎంఐలు పెరుగుతాయి.
ఫెస్టివ్ సెంటిమెంట్లతో ఇండ్ల రుణాలకు డిమాండ్ ఉంటుందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ కం సీఈవో వై విశ్వనాథ గౌడ్ చెప్పారు. ప్రస్తుత పండుగల సీజన్లో బ్యాంకులు తమ ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇండ్ల రుణాలపై అధిక వడ్డీరేట్లు ప్రతికూల ప్రభావం చూపినా.. ఓవరాల్ ఇండ్ల కొనుగోళ్ల సెంటిమెంట్ పాజిటివ్గా ఉందని బ్యాంకులు చెబుతున్నాయి.