తిరువనంతపురం: జూపార్కు అక్వేరియంలోని ఓ ఈల్ చేప, మరో ఈల్ చేప దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో జూపార్కు వైద్యులు ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆ చేపకు సర్జరీ చేయించడంతో ప్రాణాలతో బయటపడింది. కేవలం అర కిలో బరువున్న ఆ చేప చిన్న దేహంపై 30 కుట్లు పడ్డాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలోని జూపార్కులో ఈ ఘటన జరిగింది. కాగా, ఒక చేపకు జూపార్కులో ఎమర్జెన్సీ శస్త్రచికిత్స చేయడం దేశంలోనే మొదటిసారని జూపార్కు వెటర్నరీ అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురం జూపార్కు అక్వేరియంలో మూడు ఈల్ చేపలు ఉన్నాయి. అధికారులు ఆ మూడింటిని ఓకే గ్లాస్ ఎన్క్లోజర్లో పెట్టారు. దాంతో అద్ద కిలో బరువున్న ఆడ ఈల్ చేపపై మరో చేప దాడి చేసింది. ఈ దాడిలో ఆడ ఈల్ తీవ్రంగా గాయపడింది. పొట్టకింది భాగం తెగిపోయింది. అది గమనించిన జూ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు చెంగనూర్ నుంచి వెటర్నరీ సర్జన్లను తీసుకొచ్చి సర్జరీ చేయించారు.